పిల్లలే సంపదని, ప్రజలు అధిక సంతానం కనాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
జనాభా పెంచుకోవాలన్న అంశాన్ని తరచూ ప్రస్తావిస్తున్న చంద్రబాబు నాయుడు, ఎక్కువమంది సంతానం కన్నవారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని శనివారం నాడు ప్రకటించారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు, మూడో సంతానం కన్నవారికి రూ. 30 వేలు, నాలుగో సంతానం కన్నవారికి రూ.40 వేలు అప్పటికప్పుడే ప్రోత్సాహకం(ఇన్సెంటివ్)గా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించారు.
ఎక్కువమంది పిల్లల్ని కనడం భారమని చాలామంది భావిస్తుంటారని, అది నిజంకాదని చంద్రబాబు అన్నారు.
జనాభా నియంత్రణ, దాని ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు ఏదో ఒక రూపంలో తమ స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాయి. చంద్రబాబు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్లు గత కొన్నేళ్లుగా ఈ వాదనను ముందుకు తీసుకువస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది’’ అని గతంలో పలుమార్లు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
జపాన్, చైనా వంటి అనేక దేశాలు ఈ సమస్యతో ఎలా పోరాడుతున్నాయో కూడా ఆయన ప్రస్తావించారు.
రాష్ట్రాభివృద్ధి కోసం రూపొందిస్తున్న విజన్-2047లో జనాభా మీద ‘‘ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన ఇంతకు ముందే చెప్పారు. 2014 నుంచే ఆయన దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు. జనాభా పెరిగితేనే మానవ వనరులు వృద్ధి చెంది సంపద పెరుగుతుందని చెబుతూ వచ్చారు.
‘‘సంతానోత్పత్తి రేటు 1.8 కంటే తక్కువగా ఉంటే సంబంధిత దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుంది’’ అని ముంబయిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్)కి చెందిన ప్రొఫెసర్ గోలి శ్రీనివాస్ గతంలో బీబీసీతో అన్నారు.
2001లో ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల జనాభా 12.6 శాతం. కొంత కాలంగా అది పెరుగుతూ వస్తోందని డేటా చెబుతోంది.
‘‘భారత రిజిస్ట్రార్ జనరల్ గణాంకాల ప్రకారం ఈ జనాభా 2011లో 15.4 శాతంగా ఉండగా 2021లో 18.5 శాతం, 2031 నాటికి 24.7 శాతానికి పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు’’ ప్రొఫెసర్ గోలి శ్రీనివాస్ అన్నారు. వృద్ధుల జనాభా పెరుగుతోంది అంటే పని చేసే జనాభా తగ్గుతోందని అర్థం. ఇది ప్రధానంగా మానవ వనరుల కొరతకు దారి తీస్తుంది. సౌత్ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను సౌత్ కొరియా ప్రకటించింది. జపాన్ అయితే మ్యారేజ్ బడ్డెట్ కేటాయించింది.
‘‘అభివృద్ధి చెందిన దేశాల్లోనే అలా ఉంటే, ఇంకా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగా మేల్కోవడం మంచిదే కదా. ప్రస్తుత లెక్కల ప్రకారం మగవాళ్ల సగటు ఆయుర్దాయం 67 ఏళ్లు కాగా, మహిళల సగటు ఆయుర్దాయం 72. ఇక దేశంలో ఆధారపడుతున్న వృద్ధుల శాతం 20 శాతంగా నమోదైంది’’ అని ప్రొఫెసర్ గోలి శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖకు చెందిన 2020 నివేదిక అంచనా ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరుగుతోంది.
‘‘ఏపీలోనే కాదు దక్షిణాదిలోనే సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. 1980 ప్రాంతంలో ఆయా రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇప్పుడు యువశక్తి తగ్గి ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది’’ అని విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా పరిశోధనా కేంద్రం (పాపులేషన్ రీసెర్చ్ సెంటర్) డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ బి. మునిస్వామి అన్నారు.
india
చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
Quick Summary:
2001లో ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల జనాభా 12.6 శాతం. కొంత కాలంగా అది పెరుగుతూ వస్తోందని డేటా చెబుతోంది.
